టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ కి యాక్సిడెంట్ జరిగిందని.. తీవ్ర గాయాలయ్యాయని.. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ కుటుంబం సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రికి వచ్చిందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే అల్లు అర్జున్ కు ఎలాంటి గాయాలు కాలేదని.. అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. బన్నీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని అన్నారు.
అసలు బన్నీకి చికిత్స కోసం తాము ఆసుపత్రికి రాలేదని.. బన్నీ భార్య స్నేహలతారెడ్డికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించేందుకే తాము ఆసుపత్రికి వచ్చామని అన్నారు. బన్నీకి గాయాలైనట్లు వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని.. బన్నీకి చిన్నపాటి ఆరోగ్య సమస్య కూడా లేదని చెప్పారు. గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అల్లు అర్జున్ భార్య స్నేహలతా రెడ్డికి శస్త్ర చికిత్స కోసమే ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. నేటి సాయంత్రంలోగా స్నేహలతారెడ్డికి ఆపరేషన్ పూర్తి అవుతుందని.. వెంటనే డిశ్చార్జీ కూడా చేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడన్న విషయం మాత్రం చెప్పలేదు.